Tuesday, December 18, 2012

ఎగిరే కొబ్బరిచెట్టు


ప్రపంచాన్ని రెండుగా చీల్చుకుంటూ
పరుగులు పెట్టే రైలు
అకస్మాత్తుగా ఆగిపొయింది.
ఏ సిగ్నెలు కన్నెర్ర జేసిందో!


రైలు కిటికీలో నేను
వరిచేను గట్టుపై
ఒంటరి సైనికుడిలా
కొబ్బరి చెట్టు.


జోరుగా వీచే గాలికి
పది రెక్కలు విదిలించినా
ఎక్కడకీ ఎగరలేని
కొబ్బరి చెట్టు


తదేకంగా చూస్తున్న
నాలోకి మాత్రం
మెల్లగా నడుచుకునొచ్చి
లోతుగా పాతుకుపోయింది


ప్రపంచం, రైలు
మాయమైపోయాయి.


నా గుండెలోకి
ఎక్కణ్ణుంచో..
తియ్యటి నీరు!


ఇప్పుడు
ఎగిరే కొబ్బరి చెట్టుని చూడాలంటే
ఎక్కడిదాకో వెళ్ళక్కరలేదు మీరు!

Saturday, November 3, 2012

అమరావ్రతం

దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీపం వీస్తున్న గాలికి టప టపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ” అని లేచారు. ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా , రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొడుకువైపు చూసి “శిల్పికి మరణం లేదు. అసలు ఏ మనిషికీ మరణం ఉండదు. కళ్ళు తుడుచుకుని చెప్పేది విను” అన్నారు. ఆ దశలోనూ ఖంగున పలికింది ఆయన కంఠం.



“గుర్తుపెట్టుకో.. శిల్పమంటే మరేమీకాదు నువ్వే. కొత్త శిల్పం చెక్కడమంటే నిన్ను నువ్వు కొత్తగా తెలుసుకోవడమే! ఈ పరమార్థం గ్రహించడానికి నాకు కొన్ని దశాబ్దాలు పట్టింది. వెళ్ళి పూజగదిలో నా ఉలి ఉంటుంది తీసుకురా” అని, తీసుకురాగానే దాన్ని కొడుకు చేతిలో పెడుతూ ఇలా అన్నారు “శిల్పమంటే మరేమీ కాదు ను….వ్వే…” అవే ఆయన ఆఖరి మాటలు.


రామాచారి కుప్పకూలిపోయాడు. భర్త సహచర్యంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగల మనోధైర్యాన్ని సంపాదించినా ఆ క్షణంలో మాత్రం సత్యవతిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులంతా ఎవరి ఊళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఒక మహా శూన్యం ఆవరించినట్టైంది. తన భర్త ఇక లేరనే నిజన్ని బలవంతంగానైనా ఒప్పుకోవడం కష్టంగా ఉంది సత్యవతికి. ఆమె ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటోంది.

రామాచారికి తండ్రి దగ్గర తప్ప మిగతా ఎవ్వరిదగ్గరా భయం లేదు. తండ్రి ఆఖరి క్షణాల్లో చెప్పిన మాటలు అతను పట్టించుకోలేదు. అదంతా చాదస్తం అనుకున్నాడు. రాత్రీ పగలూ శిల్పాలు చెక్కుతూ తననీ తల్లినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసినందువల్లే ఆయన చిన్న వయసులో కాలం చేసారని రామాచారికి అనిపించేది.

మూడేళ్ళు గడిచాయి. రామాచారి విద్యాభ్యాసం పూర్తయ్యింది. యవ్వనంలోని బలం, విద్య వల్ల వచ్చిన విజ్ఞానం అతనికి ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. ఎవరైనా దేవుడు, భక్తి అంటే వాళ్ళవైపు ఎగతాళిగా చూసేవాడు. నలుగురు కుర్రాళ్ళని వెనకేసుకుని పందాలు కట్టడం, ఇల్లు పట్టకుండా తిరగడం ఇవీ అతని కార్యక్రమాలు.

వీడిలాగే కొనసాగితే ఏమైపోతాడో అని దిగులు పడేది సత్యవతి. అంతలోనే “”వీడి చేతిలోని కళ వీడి మనసులో లేదే. ఆ కళ వీడి మనసులో వెలిగిన రోజున వీడు నాకంటే గొప్ప శిల్పిఅవుతాడు” తన భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చేవి సత్యవతికి.


ఒక రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుతో “బాబూ, కౌలుకిచ్చిన మన పొలాన్ని రైతులు సరిగ్గా పండిస్తున్నారో లేదో, ఏదో సాకు చెప్పి ఇచ్చే ధాన్యాన్ని ఏడాదికేడాదీ తగ్గించేస్తున్నారు. ఖాళీగా తిరక్కపోతే నువ్వెళ్ళి అప్పుడప్పుడు చూసి రావచ్చు కద రా” అంది. అప్పుడే బయట ఎవరితోనో గొడవపడి వస్తున్న రామాచారికి ఈ మాటలు రుచించలేదు.

“నాన్నగారు శిల్పాలు చెక్కుతూ కాలాన్ని వృధా చేస్తుంటే ఎప్పుడైనా ఇలా చెప్పావా?” అన్నాడు.

ప్రపంచంలోని కోపమంతా ఆ క్షణాన ఆమె కళ్ళలో అగ్నిగా మారి.. అంతటి ఉద్రేకాన్ని మోయలేని మాటలు దేహాన్ని పట్టికుదిపేస్తుంటే..కళ్ళ నిండా నీళ్ళతో నిశ్శబ్దంగా మరోగదిలోకి వెళ్ళిపోయింది సత్యవతి..

తల్లిలో అంతటి ఆవేశాన్ని ఏనాడూ చూడని రామం నిశ్చేష్టుడైపోయాడు.రెండు రోజులు గడిచినా తల్లి తన మౌనాన్ని వీడకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో బోధపడలేదు. మౌనం ఎంత భయంకరమైనదో అతనికి మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. మూడో రోజు బయటకి వెళ్ళొచ్చిన రామం ఇంట్లో తల్లి ఒక్కతే కూచుని మౌనంగా కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి ఇక భరించలేక వెళ్ళి ఆమెని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసాడు.

“మానవ అస్తిత్వపు అంతిమ మర్మాల్ని శిల్పాల్లో దర్శించి, ఆ కళకి తన జీవితాన్నే అర్పించిన ఒక మహా కళాకారుడి గురించి అలా మాట్లాడ్డం తప్పు బాబూ.. శిల్పాలు చెక్కినా, వ్యవసాయం చేసినా, చివరికి నేను మంచం మీదున్నప్పుడు అహోరాత్రాలు సేవ చేసినా చేస్తున్న పనినుంచి ఆయన ఏనాడూ ఆయన్ని వేరుగా చూసుకోలేదు” తల నిమురుతూ తల్లి చెప్పుకు పోతోంది..

తల్లికి తండ్రిమీద ఎంత గొప్ప అభిప్రాయం? నమ్మలేకపోయాడు. తండ్రి రోజుల తరబడి శిల్పాల్లో మునిగి ఉంటే తల్లే తనకు అన్నీ చేసేది. అన్ని పనులూ ఆనందంగానే చేసిందన్నమాట. అతనిలో ఏవో పొరలు కరిగిపోతున్నాయి.

సాయంత్రం రామం భావనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు. ఆ దేవాలయానికి తన తండ్రే ప్రధాన శిల్పి. ముఖద్వారంలోంచి మొదటి ప్రాకారంలోకి ప్రవేశించాడు. గోపురం గూళ్ళలో పావురాళ్ళు కువకువలాడుతున్నాయి. ఎండలో వేడెక్కిన రాళ్ళు సాయంత్రానికి చల్లబడి కాళ్ళకి వెచ్చగా తగులుతున్నాయి. ప్రాకారం చుట్టూ తిరిగాడు. ప్రతి శిల్పంలోనుంచీ తన తండ్రి తనని పలకరిస్తున్నట్టనిపించింది.

“శిల్పికి మరణం లేదు” అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి.


“రామం.. ఏంటయ్యా ఇలా వచ్చావ్ ..”

అలా నాట్య భంగిమల శిల్పాలు చూస్తూ తను నిజంగా ఒక నాట్య మండపంలోనే ఉన్న అనుభూతికి లోనౌతున్న రామానికి పూజారి గారి పిలుపు వినబడలేదు.


“ఏంటయ్యా.. మైమరచిపోయావా” రెట్టించిన పూజారి గారి గొంతుతో ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి చూసాడు.

పూజారి గారు నూతిలోంచి నీళ్ళు తోడుతూ “చెప్పు ఏంటిలా వచ్చావ్ ” అన్నారు.

“ఏం లేదండీ ఊరికే” అన్నాడు రామాచారి.

“సర్లే పద.. గర్భగుళ్ళోకి.. హారతి తీసుకుందువు గాని” బిందెలో ఆఖరి చేద ఒంపుతూ అన్నారు.

“నాకు నమ్మకం లేదండీ.. మీరు వెళ్ళండి”

“చూడు రామం.. నమ్మకం లేనివాడివి గుడికి మాత్రం ఎందుకొచ్చావ్ ?”

“నాన్న గారు చెక్కిన శిల్పాలు చూద్దామని”

“గర్భగుడిలో విగ్రహం కూడా ఆయన చెక్కినదేనయ్యా.. ఇంకేం మాట్లాడకుండా రా లోపలికి”

మరీ మొండితనం బావుండదని రామం లోపలికి నడిచాడు.


గర్భగుడిలోకి ప్రవేశించగానే కాళ్ళకి నల్లని రాళ్ళు చల్లగా తగిలాయి. చుట్టూ ఒక వింత పరిమళం అలముకొంది. విశ్వంతో పాటు గుడిలోకీ ప్రవేశించాలని చూస్తోంది చీకటి. స్వామి వారి విగ్రహం ముందు వెలుగుతున్న చిన్ని దీపం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది. ఆ నూనె దీపపు కాంతి పడి స్వామి వారి విగ్రహం వింతగా మెరుస్తోంది.

“చూడు రామం.. జీవం ఉట్టిపడే ఆ విగ్రహం చూడు.. అందులో సౌందర్యం చూడు” అన్నారు పూజారి గారు.

నిజంగానే ఆ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. చూస్తున్న అతనిలో ఏదో అవ్యక్త చైతన్యం. నిర్జీవమైన రాయిలో ఇంతటి జీవమా? నమ్మలేకపోయాడు. ఆ వెలుగుతున్న చిన్ని దీపం మరేమీ కాదు తన తండ్రి ఆత్మే అనిపించింది రామానికి.


“వస్తాను పూజారి గారూ” అని వెనుదిరుగుతుంటే..

“రామం.. ఆ కళ మీ నాన్న గారితోటే అంతరించిపోకూడదు. ధరణికోటలో సిద్ధప్ప గారని మంచి శిల్పి ఉన్నారుట. ఆయన దగ్గరకి వెళ్ళి శిల్ప కళని అభ్యసించకూడదూ”


“ఆలోచిస్తాను పూజారి గారూ” అని వచ్చేసాడు.

ఇంటికెళ్ళి స్నానం చేసి పూజగదిలోకి వెళ్ళి తండ్రి ఉలిని చేతిలోకి తీసుకుని దానివైపే చూస్తూ కూచున్నాడు.

వెర్రి నాగన్న.. దారిలో పడ్డట్టున్నాడు. తరతరాలుగా వస్తున్న కళ ఎక్కడకిపోతుంది. ఏదో కుర్రతనం వల్ల మసకబడింది తప్పితే అనుకుంది సత్యవతి.


తల్లి దగ్గర ఆశీస్సులు తీసుకుని మర్నాడే ధరణి కోట ప్రయాణం కట్టాడు. “నువ్వు రంగాచారి గారి అబ్బాయివా? మీ నాన్నగారు మహాశిల్పి. ఆయన కడుపున పుట్టి నాలాంటి మామూలు శిల్పి దగ్గర నేర్చుకుంటున్నావా? నీకు ఆనందంగా నేర్పుతాను” అన్నారు సిద్ధప్ప గారు.

రోజులు గడుస్తున్నాయి. రామం శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. సిద్ధప్ప తనకు తెలిసిన మెళకువలన్నీ ఒక్కొక్కటీ చెప్తున్నారు. ఏది చెప్పినా మరుక్షణంలో గ్రహించేసేవాడు. గురువు గారికి ముచ్చట వేసేది. మిగతా శిష్యులు కూడా రామాన్ని పొగుడుతుంటే ఉబ్బితబ్బిబ్బైపోయేవాడు.


ఒక రోజు సాయంత్రం రామం, సిద్ధప్ప కృష్ణా నదిలో స్నానం చేసి వస్తుంటే మిగతా శిష్యులు పరుగు పరుగున వచ్చి రాజుగారు కబురు పెట్టారని చెప్పారు. సిద్ధప్ప వెళ్తూ తోడుగా రామాన్ని కూడా తీసుకెళ్ళారు. రాజుగారు రామచంద్రాపురంలో రామాలయం కట్టించాలని నిర్ణయించినట్టూ, ప్రధాన శిల్పిగా సిద్ధప్పని నియమించినట్టూ తెలిపారు. రాజప్రాసాదం నుండి బయటకి వస్తూ సిద్ధప్ప.. “చూసావా రామం, మన రాజు గారు కళారాధకులు. ఎన్ని ఆలయాలు కట్టించారు? ఎంత కళ వికసించింది వాళ్ళ హయాంలో! ఇప్పుడు మన మీద ఇంత బాధ్యత పెట్టారు. మనం శ్రద్ధగా చెయ్యాలి సుమా” అన్నారు.


ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం బయట ఏ ఏ ఘట్టాలు చెక్కాలి, లోపల ఏం చెక్కాలి ఇలా ప్రణాళికలు వెయ్యడంలో కూడా గురువుగారు రామాన్ని సలహాలు అడుగుతున్నారు. అంతమంది శిష్యులుండగా గురువుగారు తననే సలహాలు అడుగుతుండడంతో రామానికి ఆనందంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎవరే చిన్న తప్పు చేసినా తిట్టడం, అప్పుడప్పుడు అకారణంగానే చిరాకు పడడం చేసేవాడు.

ఒకరోజు గుడి బయట ఆంజనేయుడు సంజీవి పర్వతం చెక్కే ఘట్టం చెక్కుతున్నాడు రామం.

వీళ్ళు శిల్పాలు చెక్కడం చూడ్డానికి వచ్చిన ఊరి ప్రజల గుంపులోంచి ఎవరో అడిగారు.

“రామం, గర్భగుడిలో విగ్రహం నువ్వు చెక్కడం లేదేమీ అని?”

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు” నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రామం.

“నమ్మకం లేకనా.. చేతకాకనా?” జనంలోంచి పదునైన కంఠం..


నుదిటిమీది చెమటని తుడుచుకుంటూ తలెత్తి ఆవేశంగా చూసాడు రామం.. చూసి ఒక్క క్షణం చూపు తిప్పలేకపోయాడు. ఎవరో అమ్మాయి పచ్చని పరికిణీలో మెరుపు తీగలా తళుక్కుమంది. పక్కనే ఆమె స్నేహితురాళ్ళు ఉన్నారు. అంతా కొంటెగా రామం వైపే చూస్తున్నారు. నోటమాట రాక అలా చూస్తూ ఉండిపోయాడు. “పదండే వెళ్దాం…” కిల కిలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటే అందెల రవళి కూడా దూరమయ్యింది.

జనంలో ఎవరో అడుగుతున్నారు. “ఎవర్రా ఆ అమ్మాయి?” అని. “పేరు కస్తూరి అంట… సిద్ధప్ప గారి దూరపు బంధువుల అమ్మాయిట” అని ఇంకెవరో చెప్పారు. రామానికి ఇవేవీ వినబడ్డం లేదు. ఆ అమ్మాయి మాటల గురించే ఆలోచిస్తున్నాడు. ఎంత అవమానం? భరించలేకపోయాడు. తను దేవుడి విగ్రహం చెక్కలేడా?

తిన్నగా సిద్ధప్ప దగ్గరకి వెళ్ళాడు.

“గురువు గారూ, శిల్పిగా నా స్థాయి ఏమిటి?”

“నీకేం రామం… నువ్వు చాలా మంచి శిల్పివి.”

“ఐతే గర్భగుడిలో రాములవారి విగ్రహం నేను చెక్కొచ్చా?”

“లేదు . దానికింకా సమయం ఉంది. నువ్వు మరికొన్నాళ్ళు సాధన చెయ్యాలి”

గురువుగారి మాటలు రుచించలేదు. ఎప్పుడూ తననే సలహా అడిగి తీసుకునే గురువు గారు ఇలా కాదంటారని అతనూహించలేదు.

“ఇప్పుడు మీ కపటత్వం బయటపడింది. నాకు కీర్తి రావడం మీకు ఇష్టం లేదు. నా ప్రతిభ చూసి మీకు అసూయ”

“రామం.. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?” మరొక శిష్యుడు విశ్వనాథం వారించబోయాడు.

“నాకు నువ్వేం చెప్పక్కరలేదు. నా ప్రతిభలో పదోవంతైనా లేని వాళ్ళంతా సలహా ఇస్తుంటే తీసుకోడానికి నేను సిద్ధంగా లేను”


గొడవపడబోతున్న విశ్వనాథాన్ని చూపులతోనే వారించి “సరే నాయనా. గర్భ గుడిలో రాముల వారి విగ్రహం నువ్వే చెక్కుదూగాని” అని ఒక నవ్వు నవ్వి వెళ్ళి పోయారు. ఆ నవ్వు తనని రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది. నేను చెక్కలేకపోవడమా అనుకున్నాడు.


మర్నాడే శిల్పం ప్రారంభించాడు. రోజులు గడుస్తున్నకొద్దీ, శిల్పం పూర్తవుతున్న కొద్దీ అతనిలో ఉత్సాహంతో పాటు అహంకారం కూడా పెరుగుతోంది. పొందబోతున్న గెలుపూ, దక్కబోతున్న గౌరవాలూ, సన్మానాలూ అతని కళ్ళకి మాయపొరలు కమ్మేసాయి. ఇక ముఖం ఒక్కటే మిగిలి ఉంది. మిగతా భాగమంతా తాను అనుకున్నట్టుగా రావడంతో అతని అహంకారం ఇంకా పెరిగిపోయింది. త్వరలోనే శిల్పాన్ని పూర్తి చేసి గురువు గారికి చూపించి గర్వంగా నవ్వుదామనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా జీవకళ మాత్రం రాలేదు. రామం ఒక్క సారి చతికిలపడిపోయాడు.


చీకటి పడింది… అంతా ఇంటికి వెళ్ళిపోయారు… దట్టంగా మేఘాలు కమ్ముకుని కుండపోతగా వర్షం కురుస్తున్నా అలాగే కూచుండిపోయాడు. లోపం ఎక్కడుంది? అతని ఆలోచనకి అందట్లేదు. ఈలోగా అకస్మాత్తుగా వర్షం తనమీద కురవడం ఆగిపోయింది. తలెత్తి చూస్తే గొడుగు పడుతూ కస్తూరి.

ఏదో శక్తి కమ్మినట్టు లేచి నిల్చున్నాడు.


కాసేపు మౌనంగా నడిచాక… “మీ ప్రయత్నంలో లోపం చెప్పనా?” అంది.

“నువ్వు చెప్పేది నాకు తెలుసు. నాకు దేవుడి మీద నమ్మకం లేదంటావు. అంతే కదా?”

“అది చాలా చిన్న విషయం”

“మరి??”

“ప్రతి శిల్పాన్నీ “నేను” సృష్టిస్తున్నాను అనే అహంకారం మీలో ఉంది. అది పోయేవరకూ మీరు నిజమైన శిల్పాన్ని సృష్టించలేరు.”

చాచి లెంపకాయ కొట్టినట్టనిపించింది. కాళ్ళకింద భూమి కంపించిపోతున్నట్టయ్యింది. ఆమె కళ్ళలోకి చూడలేకపోయాడు. అక్కడక్కడా మెరుపు వెలుగులో వాన చినుకులు మెరుస్తుంటే నిశ్శబ్దంగా నడుస్తున్నారిద్దరూ. అతని అంతరంగమంతటా వానచినుకుల్లా ఆలోచనలు. మౌనంగా గొడుగులోంచి బయటకి నడిచాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. తిన్నగా వెళ్ళి గురువుగారి ఇంటి తలుపు తట్టాడు. ఈ వర్షంలో ఎవరా అని తలుపు తీసారు.

ఎదురుగా… ఎరుపెక్కిన కళ్ళతో, వర్షంలో తడిసి ముద్దై… రామం


రామాన్ని చూడగానే విషయం గ్రహించి మౌనంగా లోపలికి తీసుకెళ్ళి , “ఓటమిలేకుండా గెలుపు లేదు” అని భుజం తట్టి ఇంటికి పంపించేసారు.


మర్నాడు ఉదయాన్నే లేచాడు. రాత్రి వాన వెలిసాక, వేకువ మనోహరంగా ఉంది. సూర్యుడి బంగారు కిరణాలు పడుతుంటే కృష్ణా నదిలో స్నానం చేసాడు. ఉలిని చేతిలోకి తీసుకున్నాడు. మొదటి సారి తాకిన అనుభవం కలిగింది. తనని పలికించే శక్తిని ప్రార్థించాడు శిల్పాన్ని పూర్తి చెయ్యగల సామర్థ్యాన్ని ప్రసాదించమని. మలచబోయే నల్లని రాయిని చూసాడు.అందులోంచి రాముడు తనని చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా అనిపించింది. రామాయణం నిజంగా జరిగిందా? రాముడు నిజంగా ఉన్నాడా? ఏమో! అవేవీ ఆలోచించే స్థితిలో తాను లేనని అతనికి అనిపించింది.


ఉలితో శిల్పంలోంచి శిలను తొలగిస్తుంటే అతనిలోని సకల భేషజాలూ తొలగిపోతున్నట్టనిపిస్తోంది. శిలలాంటి అతని మనసు శిల్పంగా మారుతోంది. కొత్త ఉత్సాహం. ఏదో శక్తి అతడిని సమ్మోహన పరుస్తోంది. ఆ శక్తికి తనని తాను పూర్తిగా అర్పించేసుకున్నాడు. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. తిండి కూడా సహించడం లేదు. సూర్యచంద్రులు ఆ కళ్ళలోనే ఉదయించేవారు.

“మీరు ఇంకా ఎన్నో శిల్పాలు చెక్కాలి. ఆరోగ్యం కాపాడుకోండి” అనేది కస్తూరి.

“లేదు కస్తూరీ… నీకు తెలీదు. చెక్కే ప్రతి శిల్పం శిల్పి దృష్టిలో ఆఖరిదే కావాలి” అనేవాడు.

కొడుకుని చూడ్డానికి వచ్చిన సత్యవతి భర్తలో చూసిన ఉన్మత్తతని తొలిసారి కొడుకులో చూస్తోంది. మరొక శిల్పి ఉద్భవించాడు అని తృప్తిగా నిట్టూర్చింది.


శిల్పం పూర్తయ్యింది. సాక్షాత్తూ రాముడే వచ్చి కొలువైనట్టుగా ఉంది శిల్పం అన్నారంతా. సిద్ధప్ప రామాన్ని కౌగిలించుకున్నారు. అదే గుడిలో శ్రీరామనవమికి రామానికీ, కస్తూరికీ వైభవంగా పెళ్ళి జరిపించి కొన్నాళ్ళకి సత్యవతి నిశ్చింతగా కన్నుమూసింది.


                      ***


ఒక రోజు సాయంత్రం గుడికెళ్ళి వస్తుంటే కస్తూరి అడిగింది

“ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముతారా?”

“దేవుణ్ణి నమ్మడం సంగతి తెలీదుగానీ ఈ దేవతని మాత్రం నమ్ముతాను ” అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

“ఐతే ఈ దేవత శిల్పాన్ని చెక్కొచ్చుకదా… అనుగ్రహిస్తుంది.”

“అమ్మో… ఇంత అందమైన శిల్పాన్నే… నా వల్ల కాదు… ఈ శిల్పాన్ని మలచిన బ్రహ్మతో పోటీ పడలేను.”

“ఏమో… సమయమొస్తేనో! ఎవరు చూడొచ్చారు?” అని నవ్వింది.


కొన్నాళ్ళకి కస్తూరికి నెలలు నిండాయి. ఐతే కాన్పు కష్టమై తల్లీ, బిడ్డా పురిటిలోనే చనిపోయారు. భార్యావియోగంతో రామాచారి పిచ్చివాడైపోయాడు. శిల్పాలన్నీ వదిలేసి బికారిగా తిరుగుతున్నాడు. గొప్ప శిల్పాలు సృష్టించాల్సిన రామాచారి ఇలా ఐపోవడం ఊరి ప్రజల్ని కలచివేసింది. ఎందరో రామాన్ని తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యారు.


ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో దారి తప్పి దాహంతో తిరుగుతున్న రామాన్ని చూసి పక్క ఊరి ఆకతాయి పిల్లలు రాళ్ళు విసురుతుంటే తప్పించుకునే ప్రయత్నంలో వెనక్కి తూలిపడబోయాడు. ఏవో రెండు బలమైన చేతులు పట్టి ఆపాయి. వెనక్కి తిరిగి చూసాడు. ఆరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన అనుభూతి కలిగింది. ఆయన బౌద్ధ గురువు ధర్మపాలుడు. ఆ చూపుల్లో ప్రేమ, అనంతమైన కరుణ.

“ఎందుకు పడిపోతున్నావ్ ?” ధర్మపాలుడి కంఠం గుడిగంటలా మ్రోగింది.

“దెబ్బలు తప్పించుకోవడానికి”

“దెబ్బలు తట్టుకుంటేనే కదా శిల శిల్పమయ్యేది”

“నాకు ఏ శిల్పమూ కావాలని లేదు”

“ఎందుకు లేదు?”

“నా కస్తూరి నా నుండి వెళ్ళిపోయింది ”

“ఎక్కడికి వెళ్ళిపోయింది?”

అవును ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధానం దొరకలేదు రామానికి.


“రామం… ఏ జీవీ మరణించడు. ఇన్ని రూపాల్లో నిండి ఉన్నది ఒకే శక్తి. నీలో శిల్పకళ నింపిందీ అదే… ఆ శక్తికి నాశనం లేదు. నీ సాధన పూర్ణత్వాన్ని సాధించలేదు. అందుకే నువ్వింకా దుఃఖితుడవై ఉన్నావు”

“ఏ మనిషీ మరణించడు” తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. మరణశయ్యపై సైతం చిరునవ్వు నవ్విన తన తండ్రి రూపం ఒక్క క్షణం మదిలో మెదిలింది. మౌనంగా ధర్మపాలుని పాదాల్ని స్పృశించాడు. రెండు కన్నీటిబొట్లు ఆ పాదాల్ని తాకాయి. ఆ దివ్య స్పర్శతో రామం గుండెలోని చీకటి మొత్తం తొలగిపోయింది.తర్వాత ఆయన కోరిక మేరకు చుట్టుపక్కల ఊళ్ళలో బుద్ధ భగవానుడి శిల్పాలు చెక్కాడు. రాముడి శిల్పం చెక్కినా, బుద్ధుడి శిల్పం చెక్కినా ప్రతి శిల్పంతోనూ మాట్లాడేవాడు. శిల్పాలన్నీ ఏవో జన్మ అస్తిత్వ మరణ రహస్యాల్ని చెప్తున్నట్టనిపించేది. నృత్య భంగిమలు చెక్కినప్పుడు శిల్పాలన్నీ తన చుట్టూ భువన మోహనంగా నర్తించినట్టనిపించేది. అతిలోక సౌందర్యాన్ని ఆకళింపు చేసుకుని అది శిల్పాల్లో దర్శించేసరికి గుండె బద్దలైనంత పనయ్యేది. చెక్కే ఒక్కో శిల్పం అతడెంత అల్పుడో అతనికి తెలియజేస్తోంది, ఆద్యంత రహితమైన కళాసాగరంలో తనొక ఇసుక రేణువులా తోచేది.

చుట్టు పక్కల రాజ్యాల్లో కూడా రామం పేరు మార్మోగిపోయేది. ఎవరైనా ఇన్ని గొప్ప శిల్పాలు ఎలా సృష్టించారని అడిగితే, “నేను శిల్పాల్ని సృష్టించడమేమిటి? శిల్పాలే నన్ను సృష్టించాయి” అనేవాడు. యేళ్ళు గడిచాయి. క్రమంగా అతనిలోని శక్తి క్షీణిస్తోంది. ఎన్ని శిల్పాలు చెక్కినా, తను చెక్కాల్సిన ఏదో శిల్పం మిగిలిపోయినట్టుగా అనిపించేది. “ఏమో సమయమొస్తేనో…” కస్తూరి మాటలు జ్ఞాపకం వచ్చాయి.


కృష్ణా నదిలో స్నానం చేసి ఆఖరి శిల్పం చెక్కడం ప్రారంభించాడు. బాహువుల్ని చాపి చిరునవ్వుతో ప్రియుణ్ణి ఆహ్వానిస్తున్న ప్రియురాలి శిల్పం. తన కస్తూరినే ఊహించుకున్నాడు.ఒక పక్క అతనికి తెలుస్తోంది. కళని భరించదగ్గ శక్తిని తన దేహం మెల్లగా కోల్పోతోందని. అయినా పట్టుదలతో చెక్కుతున్నాడు. ఉన్నదున్నట్టు చెక్కేసాడు. ఇక పెదాల మీద చిరునవ్వు తెప్పించాలి. అతనికి తెలుసు… చిరునవ్వు లేకుండా శిల్పానికి పూర్ణత్వం చేకూరదని. ఎక్కడ లేని నిస్సత్తువ అతడిని ఆవహించింది. ఏదో శక్తి అతనితో తలపడుతోంది. ఆ శక్తి మృత్యువని అతనికి తెలిసిపోయింది. ఒక్క దెబ్బతో చిరునవ్వు పెదవుల మీద తెప్పించే మెళకువ అతని ఇన్నేళ్ళ సాధనలో పట్టుబడింది. ఉలిని పెదవుల మీద ఆన్చి శక్తినంతా కూడదీసుకుని సుత్తితో ఉలిమీద దెబ్బవేయబోతూ శిల్ప బాహువుల్లో కుప్పకూలిపోయాడు. ఆ పడిపోవడంలో సుత్తి ఉలిమీద పడి పెదవులు విచ్చుకుని శాశ్వతమైన చిరునవ్వు ఆ శిల్పపు పెదవులమీద విరిసింది.


                                                     ---------X---------

(రచనా కాలం 2007)

Saturday, October 27, 2012

గుప్పెడు మిణుగురులు

ఆ తీరంలో
ఎంతటి మహాత్ముడి
అడుగుజాడలైనా
చెరిగిపోక తప్పదు

నీకు నువ్వే
ఓ దారి వెతుక్కోవాలి

జీవితమూ
సముద్రమే!


    * * *

కలలెక్కడో అంతమవ్వాలి
మళ్ళీ పుష్కరాల వేళకి
ఈ నది ఉంటుందో లేదో

ఒక్క క్షణమైనా
నిన్ను విడిచిపెట్టి
నదిలోకి..
నదిని నీలోకి..

కాలం
ఎంత అర్ధరహితం!

     * * *

మట్టి రోడ్డు పక్కన
దుమ్ములో తడుస్తూ నవ్వుతున్న
గాజుపూలు, గన్నేరు పూలు
ఏవెక్కువ అందమైనవి?

తూనికలు, కొలతలులేని
ఒకే ఒక్క చూపు

సానుభూతి అంచుల్లో సంతోషం
అభినందనల అడుగున అసూయ

ఏ రంగూ లేని
ఒక్క కన్నీటిబొట్టు

నీకూ ప్రపంచానికీ మధ్య
గీతల్ని చెరిపేస్తూ...


     * * *

సముద్రమో, నదో అక్కరలేదు
చిన్ని నీటి చెలమ
కన్నుల్లో...

సూర్యుడో, చంద్రుడో అక్కరలేదు
గుప్పెడు మిణుగురులు
గుండెల్లో..

చాలు!

Saturday, July 14, 2012

గోడలు



                                      రెండు శరీరాల మధ్యేకాదు
                                      ఒకే ఆత్మకూ
                                      రెండు దారుల మధ్య
                                      వంతెన అతి సున్నితమైనది

                                                                             --- ఇక్బాల్ చంద్



 'May I have your attention please..This is the final call for passengers travelling from .....' announcer గొంతు మృదువు గా పలుకుతోంది. అప్పటివరకు హైదరాబాద్ ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తూ హక్స్ లీ, అన్ని తత్వాల సారంతోనూ రాసిన perinnial philosophy లో మునిగి ఉన్న నేను ఒక్క సారి తలెత్తి చూసాను. ఎవరో అమ్మాయి గాభరా గా సెక్యూరిటీ చెక్ వైపు పరుగెడుతోంది. నన్ను ఆకర్షించినవి ఆమె కళ్ళు. ఎక్కడో చూసాను అలాంటి కళ్ళను. ఏ విషయాన్నీ అంత తొందరగా మర్చిపోయే మనిషిని కాను నేను. Yes గుర్తొస్తోంది. పదేళ్ళ క్రితం university of Singapore లో జెన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీద ప్రసంగిస్తూ సుప్రసిద్ధ కవయిత్రి సొనోమీ రాసిన అద్భుత కవిత ఏకాంత దీపం' గురించి వివరిస్తుంటే ముందు వరసలో కూర్చొని ఆసక్తిగా విని, లెక్చర్ అయిపోయాక కలిసి నాకు అర్ధం కాలేదు అని మళ్ళీ చెప్పించుకుని చెప్పింది అర్ధమవగానే ఆమె కళ్ళల్లో కనిపించిన కాంతిని నేనెప్పటికీ మరువలేను.


65 యేళ్ళ నా జీవిత ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో అనుభవాలు. ఎయిర్పోర్ట్ లు, రైల్వే స్టేషన్లు నా జీవితంలో అంతర్భాగమైపోయాయి. పేరు తెలియని స్టేషన్లలో డిసెంబర్ అర్ధ రాత్రి చలిలో ఒంటరిగా వెచ్చని టీ తాగడం, టాప్ లేని రిక్షాలో ఊరంతా తిరుగుతూ ఫిలాసఫీ పుస్తకాలు చదవడం నాకు ఇష్టమైన పనులు. May I have your attention please...announcer చేస్తున్న announcement తో ఈ లోకంలోకి వచ్చాను. ఈ సారి ఫ్లైట్ నాది కావడం తో చదువుతున్న పుస్తకాన్ని బేగ్ లో పెట్టి సెక్యూరిటీ చెక్ వైపు నడిచాను.ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కావడం తో ఎయిర్ హోస్టెస్ సాంప్రదాయసిద్దం గా నమస్కారం పెడుతోంది. మెల్లగా సీట్ చూసుకుని కూర్చుని, ఆపేసిన పుస్తకాన్ని మళ్ళీ ప్రారంభించాను. ఎయిర్ హోస్టెస్ చేస్తున్న మూకాభినయం చూస్తే నాకు మొదటి సారి ఫ్లైట్ ఎక్కిన అనుభవం గుర్తొస్తోంది. 28 యేళ్ళకి మొదటి సారి ఏదో conference కి అని విమానం ఎక్కాను . తర్వాత సెమినార్లకీ కాన్ఫరెన్సులకీ ఎన్నో దేశాలు తిరిగాను. ఎందరో So called intellectuals ని కలిసాను. చర్చించాను, తర్కించాను. జమీందారీ కుటుంబంలో ఆరుగురు సంతానం లో ఐదవ వాడిగా పుట్టాను. నిర్లక్ష్యంగా పెరిగాను. చిన్నప్పటి నుంచీ ముక్కుసూటిగా వ్యవహరించడం నిష్కర్షగా తోచింది చెప్పడం వల్ల మిత్రులకన్నా శత్రువులే ఎక్కువ. అందరికీ నచ్చే విధంగా ఉండటం నాకు చేతకాదు. అద్దంలో చూసుకుంటే నా కళ్ళల్లో నాకు ఒక విధమైన ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది. అందరూ దాన్ని పొగరన్నారు. ఎవరేమనుకున్నా పట్టించుకునే మనస్తత్వం కాదు నాది. పదేళ్ళగా రాకపోకలు లేవని అమ్మ బాధపడుతుంటే చిన్నప్పుడు ఒకసారి మావయ్య వాళ్ళింటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళగానే దారితప్పి వచ్చావేంట్రా అని అడిగారు.అంతే ఇక ఆ తర్వాత ఏ బంధువుల ఇంటికీ వెళ్ళ లేదు.


మేఘాల్ని చీల్చుకుంటూ ఫ్లైట్ ముందుకు పోతుంటే నా జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ నేను వెనక్కి వెళుతున్నాను. ఎన్నో జ్ఞాపకాలు. 24 యేళ్ళకే indian railways లో Electrical engineer గా జాయినవడం, మరో రెండేళ్ళకే ఆ ఉద్యోగానికీ నాకూ పొసగక రాజీనామా చేసెయ్యడం రాజీపడని నా మనస్తత్వానికి ఉదాహరణ. తర్కించే అలవాటు ఎక్కువ కావడం వల్ల ప్రతీదాన్నీ ఖండించాను.ప్రతి విషయంపైనా ప్రశ్నార్ధకాల ధనస్సు ఎక్కుపెట్టాను. హేతుమూలమైన పాశ్చాత్య తత్వశాస్త్రం ఆ దశలో నన్ను ఎక్కువగా ఆకర్షించింది. 'నేనాలోచిస్తున్నాను కాబట్టే నేనున్నానూ అన్న రిని డెకార్టే ని అమితంగా అభిమానించాను. ఆ ప్రభావంలో హిందూ తత్వశాస్త్రాన్ని ఉట్టి ట్రాష్ గా కొట్టి పారేసాను. ఐతే క్రమంగా ఆలోచనా, హేతువూ మనల్నిఎంతో దూరం తీసుకెళ్ళలేవని గ్రహించాను. ఆ దశలో చదివిన హక్స్ లీ గేయం నాకు కడ దాకా గుర్తుండిపోతుంది.


"దైవ సమానమైన హేతురాహిత్యం నువ్వు ఆకుల నడుమ అక్కసులేక పాడుకుంటావు .... నీవు నేర్పిన జ్ఞానానికి ఉప్పొంగిపోతాను నేను! " అంటూ ఒక తుమ్మెద మీద ఆయన రాసిన ఈ గేయం, జ్ఞానం అనేది బుద్ధి, తర్కం, హేతువువీటన్నిటికీ అతీతమైనదని ఎంతో కవితాత్మకం గా చెప్పడం అప్పటిలో నన్ను ఎంతో అబ్బురపరిచింది. ఆ దశలోనే జెన్ బుద్ధిజం, అన్నిటికన్నా ఉత్కృష్టమైన హిందూ తత్వ శాస్త్రాల్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసాను. జెన్ బుద్ధిజం లోని, హిందూ తత్వశాస్త్రంలోని similarities మీద research చేసి కాశీ హిందూ విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొందాను. Zen buddhism -- An Indian's view అని నేను రాసిన పుస్తకానికిఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో philosophy professor గా 30 యేళ్ళు పనిచేసి రిటైరయ్యాను. ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదన్న assumption తో చేసిన Teaching profession నాకు సంతృప్తినిచ్చింది. అది నా అహం సంతృప్తి చెందడం వల్ల కావచ్చు.అందరూ గౌరవిస్తే నాకు వింత సంతృప్తి కలిగేది. ఆ గౌరవం కోసం చిన్న చిన్న ఆనందాలకి నేను దూరమయ్యానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.


Excuse me sir... పక్కన కూర్చున్న అమ్మాయి పిలుపుతో నా గతానుభవాల నెమరువేత కి తెరపడింది. తలతిప్పి ఆ అమ్మాయి వైపు చూసాను. 18 యేళ్ళు ఉంటాయి. ఇంకా కౌమారపు అమాయకత్వం ముఖంలోంచి పోలేదు. ఆసక్తితో కూడిన కళ్ళు ఏదో తెలుసుకోవాలనుకునే ఆ అమ్మాయి ఉబలాటాన్ని బహిర్గతం చేస్తున్నాయి.ఇన్నిసార్లు ప్రయాణించినా పక్క వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.వాళ్ళే స్వయంగా మాట్లాడితే గాని నేను ఎప్పుడూ చొరవ తీసుకుని మాట్లాడింది లేదు. అదీ ఫ్లైట్`లో ఐతే ఎవరి లోకంలో వాళ్ళు మునిగి ఉంటారు. కానీ ఈ అమ్మాయి...


'మీరు చదువుతున్న పుస్తకం...' అంటూ నీళ్ళు నములుతోంది. నేను నవ్వి 'నీకు అర్ధం కాదమ్మా...ఇది చాలా కష్టమైన పుస్తకం' అన్నాను.


'మా డాడీ కూడా ఎప్పుడూ ఇంతే సార్`. ఏ పుస్తకం గురించి అడిగినా ఇలాగే చెప్తారు, నిజం గా ఆ ఫిలాసఫీ అంత కష్టమా సార్`?' అని అడుగుతోంది.


'కష్టం కాదమ్మా... ఫిలాసఫీ ఏ మాత్రం కష్టం కాదు... ఫిలాసఫీ అంటే మనిషి మనిషి గా బ్రతకడం. అది మెల్లగా తెలుసుకుంటున్నాను కాబట్టే మూడు వారాల ట్రిప్ ని కేన్సిల్ చేసుకొని,శారద దగ్గరకి వెళ్ళిపోతున్నాను...'నా అంతరాత్మ నాకు చెబుతున్న మాటలు ఆ అమ్మాయి కి వినిపిస్తే బావుణ్ణు.


శారద... PhD చేస్తున్న కాలంలో ఇంట్లో అమ్మ పోరు భరించలేక ఆమెను పెళ్ళి చేసుకున్నాను. సెకండ్ ఫారం వరకు చదివిన పల్లెటూరి అమ్మాయి శారద.అమాయకత్వం తో కూడిన అందం ఆమెది. అమాయకత్వం,ఓర్పు,అనంతమైన సహనం కలిస్తే శారద రూపుదిద్దుకుందేమో అనిపించేది. ఏదీ తర్కించడం ఆమెకు చేత కాదు. ఎవరేం చెప్పినా నమ్మేసేది. వాదించడం వల్ల ఒరిగేదేదీ లేదని ఆమె నమ్మకం. పెళ్ళైన కొత్తల్లో నా పాండిత్యాన్ని ప్రదర్శించేందుకు ఆమెతో వాదించడానికి ప్రయత్నిస్తే తనకి ఏమీ తెలియదని హూందా గా ఒప్పుకోవడం నన్ను నివ్వెర పరిచింది. ఎక్కడో Accident లో పది మంది పిల్లలు చనిపోయారని తెలిసి ఇక్కడ ఈమె విలవిలలాడిపోయేది. ఆమె అమాయకత్వానికి నాకు నవ్వొచ్చేది. ఐతే అప్పుడప్పుడు మాత్రం నేను పగలు రాత్రి అధ్యయనం చేసి తెలుసుకున్న విషయాలు ఆమె చిన్న చిన్న పదాల్లో చెప్పేస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగేది. పాండిత్యంకన్నా జ్ఞానం ముఖ్యమన్న మాటకి సరైన అర్ధం లా ఆమె నాకు కనిపించినా, ఆమె గొప్పతనాన్ని ఏ మాత్రం అంగీకరించని ఆత్మవిశ్వాసం నాది. ఐతే అది ఆత్మవిశ్వాసం కాదు అహంకారం అని తెలుసుకోడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. అయినా ఆ విషయాన్ని కూడా ఆమె దగ్గర ఏనాడూ ఒప్పుకోలేదు.


ఒకసారి కోపంతో ఎవరినో తిడుతుంటే 'ఎందుకండీ అందరినీ తిట్టడం? వాళ్ళని ఇలా తిట్టడం వల్ల మీకు ఒరిగేదేమిటి? వాళ్ళ బలహీనతలతో పాటు వాళ్ళని ప్రేమించలేరా?' అని అడిగింది. సూఫీ కవుల తత్వాన్ని ఒక్క మాటలో చెప్పేసిన ఆమె నా దృష్టిలో సంస్కార శిఖరాలపైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్ళిపోతుంటే, నేను సంకుచిత మనస్తత్వాల అగాధాల్లోకి కూరుకుపోతున్నట్లు అనిపించేది. ఈ మానసిక సంఘర్షణలో అకారణం గా ఆమె ను కోప్పడినా ఓర్పుతో భరించిన ఆమె చిరునవ్వు నన్ను నిలువునా కోసేసేది.అయినా పగలని పాషాణాభ్యంతరాలు నావి.38 యేళ్ళ దాంపత్యంలో ఏనాడూ ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా ఆమెను మెచ్చుకోని గర్వం నాది.


ఐతే కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు..చాలా యేళ్ళు గా నన్ను మెల్ల మెల్లగా దహించేస్తున్న ఈ అపరాధ భావం ఈ మధ్య మరింత తీవ్రమైంది. రోజు రోజుకీ దిగజారుతున్న శారద ఆరోగ్యం అగ్ని కి ఆజ్యం పోస్తోంది..ఏ లెక్చర్ ఇద్దామన్నా ఏదో మహా సర్పం వెంటాడుతున్న భ్రాంతి. ఒక మహానేత్రం మందలిస్తున్న భ్రాంతి. ఒక ప్రసంగం ఇవ్వడానికి చచ్చి బ్రతకాల్సి వస్తోంది.శ్రీలంక లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో హైకూ కవి బషో కవితా తత్వంపై ఇవ్వాల్సిన లెక్చర్ సిరీస్ ని అర్ధాంతరం గా ముగించుకుని, రిటైరయ్యాక సెటిల్ అయిన విజయవాడ వెళ్ళిపోతున్నాను.ఇంటినుండి బయలుదేరిన దగ్గరనుండీ ఎందుకో శారద ని చూడాలనీ, ఆమెతో నేను నేనుగా మాట్లాడాలనీఅనిపిస్తోంది. కొన్ని విషయాలు తర్కానికి ఎప్పటికీ అందవేమో!


'సార్ ... ఏంటి సార్ చిన్న ప్రశ్న కి ఇంతలా ఆలోచిస్తున్నారు. అంత కష్టమైతే చెప్పొద్దులెండి. అయినా కాసేపట్లో ఫ్లైట్ హైదరాబాద్లో లేండ్ అవబోతోంది ' అని ఆ అమ్మాయి అనే దాకా నేను ఫ్లైట్ లో ఉన్నట్లే మర్చిపోయాను.ఆ అమ్మాయికి బాయ్ చెప్పేసి ఎయిర్`పోర్ట్ నుంచి బయటపడ్డాను.



                                              ****


Hyderabad లో Airport నుంచి రైల్వే స్టేషన్ కి టాక్సీ శరవేగంతో దూసుకుపోతోంది. ఒక్క సిగ్నల్ పడినా అసహనం పెరిగిపోతోంది. టాక్సీలో కూర్చొని ఆమెతో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో పరిశోధనా వ్యాసాలు,పుస్తకాలు రాసి ఎన్నో లెక్చర్లిచ్చిన నేను ఇలా శారద తో సంభాషణ ఎలా ప్రారంభించాలని ఇంతలా ఆలోచించడం నాకు నవ్వు తెప్పిస్తోంది.


 రైల్వే స్టేషన్ నుండి ఇంటికి ఫోన్ చేసాను. మంగమ్మ ఫోన్ ఎత్తి అయ్య గారూ అమ్మ గారికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు అని చెబుతోంది. మరి ఈ విషయం నాకు వెంటనే ఎందుకు తెలియజెయ్యలేదంటే మిమ్మల్ని disturb చెయ్యడం ఎందుకని అమ్మగారే చెప్పొద్దన్నారు అంది. సరే నేను వెంటనే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసాను. నా శారదకు ఏమీ కాకూడదు ..ట్రైన్ లో అంతా ఇదే ఆలోచన.నేను హాస్పిటల్ కి వెళ్ళేసరికి స్నేహితులు అంతా మూగి ఉన్నారు.మంచంపైన శారద ఏవో తెలియని శక్తుల పెనుగులాటలో మూసుకు పోతున్న కళ్ళని బలవంతం గా తెరుచుకుని ఉంది. నా గురించే మృత్యువుని సైతం ఆపిందేమో అన్నట్టు నా వైపు చూసి జీవం లేని చిరునవ్వొకటి నవ్వింది. అదే ఆమె ఆఖరి చిరు నవ్వు.


యుగయుగాలు గా మృత్యువు జీవాన్ని చూసి నవ్వుతున్న చిరునవ్వు. నా హృదయపు రాతి గోడల్ని బ్రద్ధలు చెయ్యాలని జీవితాంతం ప్రయత్నించిన చిరునవ్వు,నా లైబ్రరీలోని తత్వశాస్త్ర గ్రంధాలన్నింటినీ త్రాసులో ఒక పక్కపెడితే అలవోకగా తేల్చెయ్యగలనిర్మలమైన చిరునవ్వు.


ఒక్కసారి ఆమె బ్రతికితే ఆమె ఒడిలో తలపెట్టుకుని నా అల్పత్వాన్ని అంగీకరించి గుండెలు పగిలేలా ఏడుద్దామని ఉంది. చివరికి నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు..చావులో సైతం ఆమె నన్ను జయించింది. ఏడుస్తున్నాను. కన్నీరు మున్నీరు గా ఏడుస్తున్నాను. ఆ కన్నీటి ప్రవాహంలో ఇన్నేళ్ళ అహంకారం,పాండిత్యం అన్నీ కొట్టుకుపోతున్నాయి. అనంతమైన శూన్యం లో నిరాకారంగా కనిపిస్తున్న అంతరంగం ఎదుట నిస్సహాయం గా నేను మిగిలిపోయాను.

                                               ------------ X -------------

( రచనా కాలం 2004 )

Sunday, July 8, 2012

అద్వైతం

పౌర్ణమి నాడు
పరిపూర్ణతనొందే
రాత్రి ఆత్మ

అమావాస్య నాడు
శూన్యంలోకి
అదృశ్యమౌతుంది

ఏం ఏకత్వాన్ని దర్శించిందో
ఒకేలా ఎగసిపడుతూ
పిచ్చి సముద్రం!

Sunday, July 1, 2012

ఎంత సాధన చేసీ...

క్షణాలు.. యుగాలు..
గోళీల్లా దొర్లిపోతుంటే..
నాలో నేను..
నాతో నేను..

అర్ధరాత్రి ప్లాట్ ఫాం మీద
నల్ల పలకల బెంచీలన్నీ నిద్ర జోగుతుంటే
మంచులో తడుస్తున్న పట్టాల్ని చూస్తూ
నేనొఖ్ఖణ్ణే...
చీకటి వెలుగుల మధ్య
నిరీక్షించాను

చలికాలపు సాయంత్రం
ఆకులన్నీ రాలిన చెట్టు కొమ్మలా
ఆకాశాన్ని
గుచ్చి గుచ్చి ప్రశ్నించాను

లోపలా బయటా
వెలిగిపోతూ సాగిపోయే
నదిలో దీపంలో
ఆత్మని ఐక్యం చేసి
అన్వేషించాను

ఎంత సాధన చేసీ
ఏ దుమ్మూ అంటని పసికళ్ళని
మళ్ళీ అందుకోలేకపోయాను

Saturday, June 23, 2012

నక్షత్రాల దుఃఖం

ప్రయాణించి ప్రయాణించి
ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి
చేరుకుంటాను

మంచుబొట్టు తాకిడికే
ముడుచుకుపోయే
అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం
నాలో ప్రవేశిస్తుంది

రాత్రంతా దుఃఖించే
నదీ నక్షత్రాలూ
నాకిప్పుడు బోధపడుతున్నాయి!

Saturday, June 9, 2012

వెదురుపొద - నది

వెదురుపొద :

పాటకోసం తూట్లుపొడిచేవాళ్ళే తప్ప
నా గురించి పాడేవాళ్ళే లేరు
పక్కన కూచోబెట్టుకుని
చక్కగా పాడతావు

యుగాలుగా
అలుపెరుగక..

కొండగాలికి నే పాడే పాట
నిజానికి నువ్వు నేర్పిందే


నది :

దాహం తీర్చుకుని
కలుషితం చేసేవాళ్ళే తప్ప
గుండె కరిగి పాడుతున్నా
వినే గుండె లేదు

అంగీకారంతో తలూపుతూ
ఆనందంగా వింటావు

నిరంతరం నీ నీడ
నాలో ప్రతిఫలిస్తుంది

మనల్ని బంధించిన పాట కోసమే
మనిద్దరం

ప్రపంచంతో
పనేమిటీ?

Saturday, May 12, 2012

రంగులు

వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు

గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!

Friday, April 27, 2012

కొండవాగులో బంతి -- కథ వెనక కథ


కవిగా నా జీవితంలో 2004 నుండి 2007 వరకు మరుపురాని కాలం. సేదదీర్చిన ప్రతి చెట్టు నీడనీ కాసేపు ప్రతిఫలిస్తూ ఒక ప్రవాహంలా సాగిపోతున్న రోజులు. ఆ రోజుల్లోనే ఇస్మాయిల్ "రాత్రి వచ్చిన రహస్యపు వాన" లో పూర్తిగా తడిసిపోయాను. జీవితం ఇంత ఆనందమయమా? కవిత్వం ఇంత సరళమా? అని అబ్బురపడుతున్నాను. అప్పుడు చదివిన కరుణ ముఖ్యం వ్యాసాలు వాటి ద్వారా పరిచయమైన జెన్ కవిత్వం , హైకూలు నా జీవితం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపాయి. సరిగ్గా ఆ రోజుల్లో ఒక ఆదివారం మిత్రులు నండూరి గారు ఫోన్ చేసి బాపు గారి బొమ్మలు, కొన్ని పుస్తకాలు ప్రదర్శన ఉంది వెళ్దామా అన్నారు. అక్కడ పుస్తకాల్లో "త్రిపుర కథలు" పుస్తకం చూసాను. రచయిత పేరు వినలేదు. వాంగో స్కేరీ నైట్స్ పెయింటింగ్ ఆ పుస్తకానికి కవర్ పేజీ. లోపలి పేజీలు తిరగేసాను..


Who calls my poems poems?

My poems are not poems.

Knowing my poems are not poems

Together we can begin to speak of poetry.


                                                                -- ryokan


 నాకు బాగా ఇష్టమైన ర్యోకన్ కవిత. ఈయనకి కూడా నచ్చిందే అని ఒక అబ్బురం. ఇంకేమీ ఆలోచించకుండా పుస్తకం కొనుక్కున్నాను. ఇంటికి వచ్చి "పాము" కథ చదివాను. కొత్తగా ఉందే అనిపించింది. కథలు నన్ను చదివించాయి. మళ్ళీ మళ్ళీ చదివించాయి. ఆ కథల్లో కల్పించిన వాతావరణం అంతా నాకు కొత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసరాలు, మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్, బర్మా ఇవన్నీ. వ్యక్తుల మనస్తత్వం కూడా నాకు కొత్త. ఉన్నత తరగతిలోంచి వచ్చిన మనుషులు. అయినా చిత్రంగా కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. ఆయన పదాలతో బొమ్మ కట్టే తీరు, సముద్రపు హోరులో కెరటానికీ, కెరటానికీ మధ్య ఉన్న అమోఘమైన నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశపెట్టగల ఆయన ప్రజ్న నన్ను అబ్బుర పరిచింది. రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు. సాఫీగా తాపీగా సాగే "అనగనగా..." కథలకి అలవాటు పడిన నన్ను ఒక్కసారిగా ఒక మహాప్రవాహంలోకి తోసేసినట్లైంది. మనిషి సాటి మనిషి కోసం చెయ్యగలిగిన త్యాగం ఒక వైపు, ద్రోహం మరోవైపు ఈ రెండిటి మధ్యా ఈయన కథలు ఊగిసలాడతాయి. ఆయన కథల్లో అంతర్లీనంగా ఉండే జెన్ బౌద్ధం కూడా నన్ను ఆకర్షించింది. నేను ఎన్నో పుస్తకాలు కొని చదివేసాకా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. ఇంట్లో లైబ్రరీలు మెయింటైన్ చెయ్యాలనీ, చదివిన పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలనీ ఉండదు. కానీ నా దగ్గర ఉంచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకాల్లో త్రిపుర కథలు కూడా ఒకటి.


 త్రిపుర కథల్లో నాకు బాగా నచ్చిన "జర్కన్" అనే కథను ఒక ప్రేమ కథగా రాద్దామని ఉండేది. అదే ఆలోచన దాదాపు రెండేళ్ళ తర్వాత "కొండవాగులో బంతి"గా బయటకి వచ్చింది. "కొండవాగులో బంతి" రాసే సమయానికి నేను జెన్ తాత్వికతలో మునిగితేలుతున్నాను. అసలు జెన్ ఒక తాత్వికత కూడా కాదు. అదో జీవన విధానం. తరచి తరచి చూసాకా ఆ జెన్ మూలాలు నాలో ఉన్నాయని నాకర్ధమైంది. ఉదాహరణకి సెలయేరు ఒక జెన్ ప్రతీక. జెన్ బౌద్ధం గురించి తెలీక మునుపే నేను సెలయేరు మీద చాలా కవితలు రాసి ఉన్నాను. ఆ దశలో ప్రకాష్ అని మా ఫ్రెండుతో 2006 లో ఒక అర్ధరాత్రి వైజాగు బీచ్లో కెరటాలు జూలు గుర్రాల్లా తీరం వైపు దూసుకొస్తుంటే చూస్తూ ఒక చర్చ నడిచింది. నేను కవిత్వ సాధన , జెన్ అధ్యయనం ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు వాడు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్న సూక్తి అనుభవంలోకి వచ్చింది.


  వాడన్నాడు "ఈ కాలంలో బుద్దుడు బోధి చెట్టుకింద కూచోనక్కరలేదు రా" అని, దాదాపు నేనూ అదే అభిప్రాయంతో ఉండడంతో అమితాశ్చర్యంతో "నేషనల్ జియోగ్రఫీ చానల్ చూస్తే చాలు" అని పూరించాను. ఈసారి ఆశ్చర్యపోవడం వాడి వంతయ్యింది. ఎందుకంటే వాడు సరిగ్గా అదే విషయం చెప్దామనుకున్నాట్ట. ఇద్దరికీ ఆ రోజు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఆ చర్చలూ ఆలోచనలూ అన్నీ ఆ కథలో ప్రతిబింబిస్తాయి.

 నాకెంతో ఇష్టమైన త్రిపుర గారు గత పాతికేళ్ళ నుంచీ వైజాగులోనే ఉంటున్నా , చాలా సార్లు బీచ్ కి వెళ్ళినప్పుడు పాండురంగాపురం డౌన్లోంచే వెళ్ళినా, ఆ సముద్రపొడ్డున చిన్న అపార్టుమెంటులో మరో సముద్రం ఉందని నాకు తెలీలేదు. గత సంవత్సరం కనక ప్రసాద్ గారు, మరొక త్రిపుర గారి వీరాభిమాని రామయ్య గారు వీళ్ళిద్దరి ద్వారా త్రిపుర గారితో పరిచయం కలిగింది. ఆయన వాత్సల్యాన్నీ, కరుణనీ పొందగలిగాకా "త్రిపుర గారే ఉండగా ఆయన కథలెందుకులే" అని కనకప్రసాద్ గారి మాటలు ఎంత నిజమో అనిపిస్తాయి.


 కొండవాగులో బంతి కథని ఎవరైనా పొగిడినప్పుడల్లా అది ఒరిజినల్ కథ కాదనీ, త్రిపుర గారి జర్కన్ కథకి అనుసరణ మాత్రమే అనీ ఆ పొగడ్తలన్నీ ఆయనకే చెందాలనీ చెప్పాలని ఉంటుంది .అందుకే ఈ పోస్టు.

Thursday, April 5, 2012

కొండవాగులో బంతి

IIT Kharagpur లో Phd లో చేరిన రెండేళ్ళకి ఒక paper ప్రచురించగలిగాను. అదీకాక ఈ సంవత్సరం బెంగుళూరులో జరుగుతున్న International conference లో పబ్లిష్ అయ్యింది. నా presentationకి మంచి స్పందనే వచ్చింది. ఈ విశేషాలన్నీ మా గైడుకి ఫోన్ చేసి చెప్పాలని బయటకొచ్చి , మొబైల్ ఆన్ చేసేసరికి రెండు కొత్త మెసేజిలు వచ్చాయి. ఒకటి ఎప్పటిలాగే Airtel wishes you a pleasent stay in karnataka అని, మరొకటి హిమబిందు దగ్గరనుంచి "Ravi, Please Call me immediately, Bindu" అని ఉంది. ముందు గైడుకి ఫోన్ చేసి విశేషాలన్నీ చెప్పేసి,వెంటనే హిమబిందుకి ఫోన్ చేసా. అర్జంటుగా నన్ను కలవాలట. ఎందుకో కలిసినప్పుడే చెప్తుందట. ప్రస్తుతం భద్రాచలంలో ఉందట.

ఆమెని భరించడం కష్టం. ఆమెలో ఒక సెలయేరుతో పాటు ఒక జలపాతం కూడా ఉంది. ఒక్కోసారి వెల్లువెత్తినట్టు మెయిల్స్ , ఫోన్స్ కురిపిస్తుంది. మరొక సారి కొన్ని నెలలపాటు మౌనంగా ఉండిపోతుంది.

నేను ఇప్పుడు కలవడం కుదరదన్నా తను వినదు. అందుకని ఇవాళ conference ఐపోగానే ఫ్రెండ్ ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాననీ, ఎల్లుండి అంతా అక్కడే ఉంటానని, ఎల్లుండి వైజాగ్ రాగలిగితే కలవొచ్చనీ చెప్పాను.సరే ఐతే jan 12th, 6 o clock, RK Beach అని చెప్పి పెట్టేసింది.

 మొదటిసారి ఆమెని రాజమండ్రిలో కలిసాను. నేను hermitary.com వెబ్సైట్ కి రాసిన, A modern buddha need not sit under bodhi tree అన్న వ్యాసం చదివి, నాకు మొదటిసారి మెయిల్ చేసింది. నా ఫిలాసఫీ ఆమెకి నచ్చిందని. ఆ తర్వాత మా మధ్య చాలా మెయిల్స్ నడిచాయి. తన ఇష్టాయిష్టాలన్నీ రాసేది. తనకి నదులంటే ప్రాణం అనీ, భారతదేశంలోని నదుల మీద పరిశోధన చేస్తున్నాననీ, ప్రస్తుతం దక్షిణ గంగ అయిన గోదావరి మీద రీసెర్చిలో భాగంగా రాజమండ్రిలో ఉన్నాననీ వీలైతే కలుద్దామనీ చెప్పింది. నేను అప్పుడు వింటర్ ఇంటర్న్ షిప్ హైదరాబాద్ క్వాల్ కాం కంపెనీలో చేస్తుండేవాడిని. అది పూర్తికాగానే తిరిగి ఖరగ్పూర్ వెళ్ళిపోతూ మధ్యలో రాజమండ్రిలో దిగాను.

ఆ రోజు నాకు బాగా గుర్తు. సాయంత్రం గోదావరి ఒడ్డున కూచున్నాం ఇద్దరం. తను లేత నీలి రంగు చీర కట్టుంకుంది. పొట్టి పొడవూ లావూ సన్నం కాని రూపం. సంధ్య కాంతి ఆమె మొహం మీద పడి మెరుస్తోంది. కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత "అంత పెద్ద పెద్ద articles రాస్తారు కదా ఏమైనా మాట్లాడండి" అంది నవ్వుతూ..

"మీ మెయిల్సూ, అభిప్రాయాలూ చూసి మీరేదో జీన్ ప్యాంటూ, స్లీవ్లెస్సుతోనూ ప్రత్యక్షమౌతారనుకున్నా ఇలా అచ్చతెలుగు బాపూబొమ్మలా ఉంటారనుకోలేదు" అన్నాను.

మామూలుగా ఎలా ఉన్నా నది ఒడ్డుకి వచ్చేటప్పుడు మాత్రం చీర కట్టుకోవాలనిపిస్తుందిట. అటు చూడండి గోదావరికి సూర్యుడు బంగారు చీర కడుతున్నాడు అని చూపించింది. నిజంగానే సంధ్య కాంతి గోదావరి మీద పడుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది.

"ఇంకా నయం కస్తూరిగా మారి నీ నుదిటనే చేరి కడదాక కలిసుండనా" అని సూర్యుడు గోదావరితో పాటపాడుతున్నాడనలేదు" అని నవ్వాను. ఆమె నవ్వి "మీ nihilism, tao philosophy చదివి, మీరేదొ పరమ జిడ్డుగా, బట్టతల, గుబురు గెడ్డంతో ప్రత్యక్షమౌతారనుకున్నా, తీరా చూస్తే మీరేమో సర్ఫ్ రోష్ లో అమీర్ ఖాన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి, జంధ్యాల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లా జోకులు కూడా వేస్తున్నారు అని, సరేగానీ మీ గురించి చెప్పండి" అంది.

"నా గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదండీ. చాలావరకు మీకు తెలిసిందే... రేపే మృత్యువు నా తలుపు తడుతుందని ఊహించుకుని ఇవాళ గడపడం అన్నిటికన్నా నాకిష్టమైన పని. అలా బ్రతకడంలో గొప్ప థ్రిల్ ఉంది. Mathematics, music నా passions" అన్నాను.

ఐతే మీరూ, నేనూ ఇలా సరిగ్గా ఈ సాయంత్రం గోదావరి ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకోవడంలో ఎన్ని complicated equations solve అయ్యుంటాయో చెప్పుకోండి చూద్దాం అని నవ్వింది. నవ్వినప్పుడు ఆమె కళ్ళు సగం మూసుకుపోతాయి.అమాయకత్వం,కొంటెతనం కలబోసిన కళ్ళు. కోపం వచ్చినప్పుడు కళ్ళతోనే అవతలి వ్యక్తిని అదుపులో పెట్టగల కళ్ళు ఈమెవి అనుకున్నాను. ఆమె కళ్ళల్లోకి అలా తదేకంగా చూస్తే బావుండదని చూపులు మరల్చి నా గురించి అడిగారు గానీ మీ గురించి చెప్పనే లేదు అన్నాను.

"మెయిల్స్ లో చెబుతునే ఉన్నాగా.. డాడీ పెద్ద కాంట్రాక్టర్ చెన్నైలో. పక్కా బిజినెస్ మైండెడ్. పోటీ వచ్చినవాళ్ళని నామరూపాల్లేకుండా చేసాడు. చిన్నప్పుడు ఏదో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారితే అమ్మని పీక పిసికి చంపేసి , రెండు నెలలు తిరక్కుండానే మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. అంతా సవతి తల్లిని అంత కౄరంగా ఎందుకు చిత్రిస్తారో అర్ధం కాదు. నన్ను మాత్రం కన్నతల్లి కన్నా సవతి తల్లే బాగా చూసుకునేది.నాకో తమ్ముడున్నాడు. చదువు పెద్దగా అబ్బలేదుగానీ బిజినెస్లో తండ్రిని మించిన తనయుడు. రోజుకో అమ్మాయితో తిరుగుతాడు. ఐతే ఎవరినీ వెంటపడి వేధించడు. పెళ్ళి చేసుకుంటాననీ ప్రేమనీ అబద్ధాలు కూడా చెప్పడు. అయినా బోలెడుమంది అమ్మాయిలు వాడి చుట్టూ ఎందుకు చేరుతారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటి నిండా ఎప్పుడూ నౌకర్లు.. కార్లు..ఐశ్వర్యం.. వీటన్నిటి మధ్యా పెరిగినా నాలో ఏదో అసంతృప్తి.. ఈ రీసెర్చిలో నాకు కొంత ప్రశాంతత లభిస్తోంది.. డాడీ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు.. ఇప్పటికీ రీసెర్చి అనీ అదనీ ఇదనీ కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నా ఏమీ అనరు"

ఇలా ఆమె చెప్పుకుంటూ పోతోంది. నాకు ఎందుకో తన మాటలు వింటుంటే తామర పువ్వు గుర్తొచ్చింది. మౌనంగా ఆలోచిస్తున్న నన్ను చూసి ఏంటండీ మా వాళ్ళ మంచి చెడ్డలు అంచనా వేస్తున్నారా అని అడిగింది.

"ఒకరి మంచి చెడ్డలు అంచనా వెయ్యడానికి నేనెవరండీ" అదేం లేదు అన్నాను.

ఆమె వెంటనే "ఈ అమ్మాయేంటి తన వ్యక్తిగత విషయాలు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముక్కూ మొహం తెలీని, మొదటి సారి కలిసిన వ్యక్తికి చెప్పేస్తోందనేగా మీ అనుమానం" అంది.

ఈమె మనుషుల్ని భలే చదువుతుంది అనుకున్నా మనసులో.

మరొకసారి నవ్వి, "నేను M Phil చదివే రోజుల్లో స్నేహ అని ఒక రూమ్మేట్ తో సంవత్సరం  పాటు కలిసి  ఉన్నాను.  అయినా ఒకరి ఇష్టమైన రంగేమిటో కూడా మరొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదేమో అని, ఒంటరితనం ఒక్క దేహానికేనా?" అంది సూటిగా చూస్తూ

నేనేమీ మాట్లాడలేదు

"ఇంతకీ మీకు ఈ చైనీస్ ఫిలాసఫీ మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది? అని అడిగింది

 అంతకు ముందు చాలా మందే నన్నా ప్రశ్న అడిగారు. నిజానికి నాకు ఈ విషయాల మీద ఆసక్తి కలిగి అప్పటికి ఒక  సంవత్సరమే అయ్యింది. అప్పటిదాకా నేను కూడా అందరిలాగే ఐశ్వర్యం వెనక, అబద్ధాల వెనకా పరిగెత్తిన వాడినే. ఆ దశలో ఒక రోజు రాత్రి అకస్మాత్తుగా చనిపోయినట్టు పీడకల వచ్చింది. ఆ రాత్రి మరి నిద్రపోలేదు భయంతో వణికిపోయాను. అప్పుడనిపించింది అసలు కలకీ, వాస్తవానికీ తేడా ఏముందని? రెప్పలు తెరిచేవరకూ కల కూడా నిజంగా జరిగిందేమో అన్నంతలా  కలుగుతుంది. బహుశా మనం నిజం అనుకుంటున్న ఈ జీవితం కూడా మరొక ప్లేన్లో కలేనేమో! అకస్మాత్తుగా నాకేదో రహస్యం తెలిసిపోయిన అనుభూతి. అప్పటినుండే ప్రవాహానికి ఎదురీదడం మానేసి, ప్రవాహంతో పాటు అలా హాయిగా కొట్టుకుపోతున్నాను. అప్పుడే చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి Phdలో చేరాను

ఈ విషయాలన్నీ ఆమెతో చెబితే, "చాలా interesting గా ఉందండీ మీ కథ.. ఐతే అది కొట్టుకుపోవడం ఎలా ఔతుంది?మీరు సెలయేటితో ఒక perfect harmonyలో ఉన్నారు. "కొట్టుకుపోవడం" అనే పదం తప్పు.. Its a kind of ecastasy" అంది

"సెలయేరంటే గుర్తొచ్చింది.. ఇంతకీ నదుల మీద పరిశోధించాల్సినంత ఏముందండీ?" అని అడిగాను.

"అసలు నా దృష్టిలో పరిశోధించాల్సిన అవసరం లేని విషయమేదీ లేదు. ప్రతి దాన్లోనూ మనకి తెలియని లోతులు ఎన్నో ఉంటాయి, కాదంటారా?" అని అడిగి మళ్ళీ కొనసాగించింది. నదుల గురించి ఒక్కో విషయం తెలుసుకుంటుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. మనిషి సంస్కృతి , కళలు, నాగరికత ఇవన్నీ నదులతో ఎలా మమేకమైపోయాయోనని తెలుసుకున్నకొద్దీ పట్టరాని సంతోషం కలుగుతుంది. నిన్నే తెలిసింది గాంధీ గారు తన తల్లి చనిపోయినప్పుడు గోదావరిలో స్నానం చేసారుట తెలుసా అంది. ఈ విషయాలు చెప్తుంటే ఆమె కళ్ళల్లో మెరుపు.

ఐతే ఫైనల్ గా మీరు వైజాగ్లో సెటిల్ ఔతారన్నమాట అన్నా. ఎందుకండీ అని అడిగితే నదులన్నీ చివరికి సముద్రాన్నే కదండీ చేరాల్సింది అన్నాను.

ఆమె సవ్వడి చెయ్యకుండా నవ్వింది. శీతాకాలపు చలిగాలి నెమ్మదిగా తాకుతోంది. ఆ గాలికి ఆమె ముంగురులు నాట్యం చేస్తున్నాయి. రాజమండ్రి దీపాలు గోదాట్లో తమ మొహాలు చూసుకు మురిసిపోతున్నాయి. నేను ఈమె కళ్ళల్లో నన్ను నేను చూసుకు మురిసిపోతున్నట్టే!  ఆకాశంలో అక్కడక్కడా పక్షులు. జనం పల్చబడుతున్నారు. చాలాసేపు అలా మౌనంగా కూచుండిపోయాం. ఆమెతో మాటలతో పాటు మౌనం కూడా బావుంది. silence is ever speaking!! నిజమే కాబోలు.

 "ఇలాంటప్పుడు వేడి టీ తాగితే భలే ఉంటుంది కదండీ" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె అంది. ఐతే పదండి.అలా నడుస్తూ దగ్గర్లో ఏమైనా మంచి హోటల్ ఉందేమో చూద్దాం అన్నా. ఈ మాత్రం దానికి హోటల్ ఎందుకండీ అదిగో అక్కడేదో టీ బండి ఉంది అక్కడ తాగుదాం పదండి అని తీసుకెళ్ళింది. రెండు టీలు చెప్పాం. చలిగాలి రివ్వున వీస్తోంది. తను చేతులు రుద్దుకుని బుగ్గలకి అద్దుకుంటోంది.

రెండు గ్లాసులు అందుకుని ఒకటి ఆమెకి అందించాను. ఆ సాయంత్రం ఆమెతో కబుర్లు చెబుతూ పొగలు కక్కుతున్న టీ తాగడం! అదొక అనుభవం. కాలాన్ని కట్టివేసిన ఆ క్షణంలో నిన్న లేదు. రేపు లేదు. ఆమె లేదు. నేను లేను. అనంతంగా విస్తరించిన వర్తమానమే!

 తర్వాత ఒక రిక్షా మాట్లాడుకుని రాజమండ్రిలో కొంచెం సేపు తిరిగి, టిఫిన్ చేసి రాత్రి 8.30 కి స్టేషన్ కి చేరుకున్నాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్ సరిగ్గా తొమ్మిదికి వచ్చింది.రీసెర్చిలో భాగంగా తను గోదావరిని వివిధ ప్రాంతాల్లో తీసిన అరుదైన ఫొటోలున్న ఒక ఆల్బం నాకు బహుమతిగా ఇచ్చింది.నేను The mighty and mystical rivers of india అనే పుస్తకాన్నిస్తే చూసుకుని కవర్ పేజీని చిన్న పిల్లల్ని తడిమినట్టు తడిమి మురిసిపోయింది. రైలు మెల్లగా కదిలిపోతుంటే, ఆమె చేతులూపుతున్న దృశ్యం ఎప్పటికీ మరవలేను.

 తర్వాత నేను ఖరగ్పూర్ వెళ్ళిపోయి మళ్ళీ నా రీసెర్చితో బిజీ ఐపోయాను. ప్రొఫెస్సర్ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉండేది. ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేది.పొరపాటున మా ప్రొఫెస్సర్ కాస్త ఇబ్బంది పెడుతున్నాడని చెబితే మిమ్మల్ని ఇంకెవరో ఎలా ఇబ్బంది పెట్టగలరండీ అనేది. తన మాటలు వింటుంటే నేను ఇంకా ఎంతో ఎదగాలనిపించేది.నేను పగలూ రాత్రీ రీసెర్చి ప్రోబ్లెం సొల్యూషన్ గురించే ఆలోచించేవాడిని. తన నుంచి కుడా సడన్ గా మెయిల్స్ ఆగిపోయాయి. బహుశా బిజీగా ఉందేమో అని నేను కుడా మెయిల్ చెయ్యలేదు.

 తర్వాత ఒక సారి కాశీ నుండి ఫోన్ చేసింది. నీలాచల్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరుతున్నా, వీలైతే ఖరగ్పూర్లో స్టేషన్ కి రమ్మని. ఆమె గొంతులో ఏదో తేడాని నేను గుర్తించకపోలేదు. వెళ్ళాను. చాలా గంభీరంగా ఉంది. ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు అని అడిగితే, నది కూడా అప్పుడప్పుడు గంభీరంగా ప్రవహించాలి కదండీ అని , "తత్వ శాస్త్రం,సాహిత్యం మనిషిని అవసరమైన సమయాల్లో ఎంతవరకు ఆదుకుంటాయంటారు అంది? జరగరానిదేదో జరిగిందని తెలుస్తోంది. ఏం జరిగిందండీ అనడిగితే, వాళ్ళ తమ్ముడు ఏదో Accidentలో చనిపోయాట్ట. చిన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని accident నుండి తప్పించినందుకు govt వాళ్ళు బ్రేవరీ అవార్డు కుడా ఇచ్చారనీ, ఇప్పుడు అదే accident కి బలైపోయాడు అంది.

 తన చేతిని నా రెండు చేతుల మధ్యకి తీసుకున్నాను. ఆమె నిశ్చలంగా ఉంది. చచ్చు ఓదార్పు మాటలతో ఆ సమయాన్ని కలుషితం చెయ్యదల్చుకోలేదు. మౌనంగానే ఉండిపోయాను. రైలు కదిలిపోయింది. ఈ స్టేషన్లో కొందరిని దించేసినట్టే, రైలు తనని కూడా తన స్టేషన్లో దించేసి మౌనంగా కదిలిపోతుంది. ఇంతే. చివరికి మిగిలేదింతే. అనంతానంత వైరుధ్యాల మనిషి జీవితంలో పరమ పవిత్రమైనది మృత్యువొక్కటే. పుట్టుక ఎంత సహజమో ఇది కూడా అంతే.లోతుగా చూస్తే చావు, పుట్టుక వేరు కాదు. జీవితానికి అర్ధమేమిటన్న ప్రశ్నే అర్ధరహితంగా తోచింది ఆ క్షణంలో. జీవితానికి అర్ధమేఇమిటి? జీవితానికి అర్ధం జీవించడమే! Life is a random event.. a ball in the mountain stream.. బరువెక్కిన మనసుతో వెనక్కి వచ్చేసాను.

 తర్వాత కొన్ని నెలలపాటు ఆమెనుంచి ఎలాంటి సమాచారం లేదు. తను ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు మొబైల్ నంబర్ మార్చేస్తుంది. ఇంటి నెంబరు ఎప్పుడూ ఇవ్వదు. అయినా ఆమె ఇంట్లో ఎప్పుడైనా ఉంటేగా! బహుశా ఒక దగ్గర నిలవలేని తత్వమే ఆమెని నదులకి దగ్గర చేసి ఉండొచ్చు. అసలు ఆమె నదుల మీద పరిశోధన చేస్తోందా లేక తనని తనే శోధించుకుంటోందా? అకస్మాత్తుగా ఏ లోతుల్లోనో ఒక మెరుపు. లోపలా బయటా, చావు పుట్టుకా, మంచి చెడూ ద్వంద్వాలన్నీ మాయమయ్యాయి ఆ క్షణం. హిమబిందుకి అవధుల్లేవు. ప్రకృతిని ఉన్నదున్నట్టు చూస్తుంది. తర్కంతో ముక్కలు ముక్కలుగా కోసి చూడదు. అసలు ఆమే ప్రకృతి వేరు కాదు. సకల జగత్తులోనూ ఆమే నిండి ఉంది.. పువ్వులు, పక్షులు, సెలయేళ్ళు,ఆకాశం, హిమబిందు.. అంతే.. బుద్ధిజంలో చెబుతారు.. "Expand the I in you to fill the entire universe"అని. ఈ భావాలన్నీ ఒక చోట చేర్చి "Non-Duality" and "one" are not synonyms అని నేను రాసిన article చూసి ఒక రోజు సడన్ గా ఫోన్ చేసింది. చాలా చక్కగా రాసారని. కావేరి జన్మస్థలం తలకావేరీ వెళుతోందట.

 మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది బిందు. ఒక నదిలో ఉన్న వైరుధ్యాలూ, మలుపులు మీ జీవితంలో కూడా ఉన్నాయి అంటే "ఈర్ష్య", "అసూయ" మొదలైన పదాలని తుడిచెయ్యాలన్న ప్రయత్నంలో ఉన్న మీరుఅనవసరంగా వాటిని గుర్తుకు తెచ్చుకోకండి "The path is without any difficulty.. go on.. just like a ball in the mountain stream..." మీరు ఆర్టికిల్లో రాసిన విషయాలే అని నవ్వేది. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. ఇంతకీ ఇప్పుడు ఇంత అర్జంటుగా ఎందుకు కలవాలందో? ఆమెను అర్ధం చేసుకోవడం కష్టం. మిగతా వాళ్ళకి అతి సాధారణంగా కనిపించే విషయాలు ఆమెకి చాలా పెద్ద విషయాలు. మిగతా వాళ్ళకి చాలా గొప్పగా కనిపించే విషయాలకి ఆమె అస్సలు ప్రాధాన్యం ఇవ్వదు.ఒక సారి ఇలాగే ఫోన్ చేసి ఇవాళొక గొప్ప పని చేసా తెలుసా అంది. ఏమిటని అడిగితే "తెల్లవారుఝామున గులాబీ పువ్వు మీద కూచుని నన్ను నేను ఫొటో తీసుకున్నా" అంది

What an expression ! అప్రయత్నంగా మాటలు నా నోట్లోంచి వెలువడ్డాయి. "ఏమీ తెలీనట్టు మాట్లాడకండి, నేను ఇదంతా చేస్తుంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు" అంది. నేనెప్పుడు చూసానా అనుకుంటుంటే , తమరు అప్పుడే నిద్ర లేచి ఆకాశంలో morning walk కి వచ్చారు. గుర్తు లేదా అని నవ్వింది. అప్పటికి గానీ నా పేరు రవి అని నాకు గుర్తు రాలేదు. ఎల్లుండి కలిసినప్పుడు కూడా ఇలాంటి మంచు బిందువు స్టోరీ ఏదో చెబుతుందని నిర్ధారణకి వచ్చేసి, ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి conferenceలో నిమగ్నమయ్యాను.అది ఐపోగానే బెంగుళూరులో కలవాల్సిన ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ని కలిసి, మరికొన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసి 11 కల్లా బెంగుళూరు సెంట్రల్ స్టేషన్ కి చేరుకున్నాను. గౌహతి ఎక్స్ప్రెస్ అప్పటికే ప్లాట్ఫాం మీద ఉంది. అందులోకి ఎక్కి నా బెర్తు చూసుకుని కూలబడ్డాను. చాలా అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది.

తెల్లారేసరికి రైలు చెన్నై చేరుకుంది. మొహం కడుక్కుని, కాఫీ తాగి కాసేపు పేపర్ చదివి, పక్కన పెట్టేసాను. అదేంటో కిటికీ పక్క కూచుంటే ఏదీ చదవాలనిపించదు. అలా బయటకి చూస్తూ గంటలు గంటలు గడిపెయ్యొచ్చు. ఇదే కిటికీ పక్కన ఎంతో మంది కూచుని ఉంటారు. ఏ ఒక్కరి ఆలోచనలూ ఒకేలా ఉండవు. అయినా కిటికీ మాత్రం అమాయకంగా ఎవరికనా ఒకే దృశ్యం చూపుతుంది. "అందరిలాగే "నేను" కూడా రైలు కిటికీలోంచి అనంతంలోకి విస్తరిస్తుంటాను" డిసెంబరు చలి రాత్రి రాజమండ్రిలో నాకు వీడ్కోలివ్వడానికి వచ్చి, నేను కిటికీ పక్కన కూచున్నప్పుడు ప్లాట్ఫాం మీద నిలబడి హిమబిందు అన్న మాటలు ఎందుకో జ్ఞాపకం వచ్చాయి. అక్కడ "నేను" అనడంలో ఎంత అర్ధం ఉంది. కిటికీలోంచి దూరంగా ఏవో శిఖరాల మీద ఆమె ఒక్క క్షణం కనిపించి మాయమైంది.

ఇంతకీ ఇంత అర్జంటుగా ఎందుకు కలవాలందో? వైజాగ్ చేరేవరకు మళ్ళీ అవే ఆలోచనలు. వైజాగ్ చేరేసరికి రాత్రి 9 అయ్యింది. ట్రైన్ దిగ్గానే తనకి ఫోన్ చేసాను. భద్రాచలంలో అప్పుడే బయలుదేరుతున్నా , ఉదయానికల్లా వైజాగ్ లో ఉంటా అని చెప్పింది. మర్నాడు సాయంత్రం 6 గంటలకి RK beach లోని రామకృష్ణ ఆశ్రమంలో కలవాలని నిర్ణయించుకున్నాం.

                                         ****

 నేను కొంచెం ముందుగా వెళ్ళాను.ఆశ్రమంలో చాలా మంది ధ్యానం చేసుకుంటున్నారు. నేను కూడా ఒక చాప తీసుకుని కూచున్నాను.కొంతసేపటికి ఆమె వచ్చింది. కొంచెం సేపు మౌనంగా కూచున్నాకా లేచి అలా RK beach లోకి నడిచాం. బీచ్ లో కూచున్నాకా చెప్పండి ఇంత సడన్ గా ఎందుకు కలవాలన్నారు అని అడిగాను

"గోదావరికి వరదలొచ్చాయి" అంది.

"వరద రావడానికి కారణం?"

"ప్రతిదానికీ కారణాలుండాలనుకోవడం అమాయకత్వం"

"కానీ ఇంత అకస్మాత్తుగా వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి కదా"

"వరదంటేనే అకస్మాత్తుగా వచ్చేదని. అకస్మాత్తుగా రాని వరదకూడా ఉంటుందేమిటి?"

"మీతో నేను వాదించలేను గానీ, విషయం చెప్పండి. ఎందుకు అర్జంటుగా కలవాలన్నారు?"

అలా రండి దారికి అని నా కళ్ళల్లోకి వెర్రిగా చూస్తూ, నా చేతులు పట్టుకుని "నన్ను పెళ్ళి చేసుకోండి" అంది

నేను స్థాణువునైపోయాను ఒక్క క్షణం. ఆమె జీవితంలో ఎవరినీ పెళ్ళి చేసుకో(లే)దని నా ప్రగాఢ విశ్వాసం. ఆనకట్ట కట్టడం ప్రవాహానికి ఇష్టం ఉండదు. ఇదే విషయం ఆమెతో అంటే,

"ఇది ఆనకట్ట అని ఎందుకనుకుంటున్నారు? సాగరసంగమం అనుకోవచ్చు కదా"

"కానీ ఆ సముద్రం నేనే అని మీకెందుకు అనిపించింది?"

"నిజం చెప్పండి...మీలో సంగమించే నది ఏమిటన్నది మీకు మాత్రం తెలీదా? మీరు నన్ను ప్రేమించలేదా అంది..

కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి...చీకటి వెలుగులు సముద్రంతో దోబూచులాడుతున్నాయి... అల్లంత దూరంలో అవని ఆకాశం కలిసిపోయినట్టు భ్రమ...

ఆమెకు చెప్పగలను..." ఆమె సమక్షంలో నా హృదయం లయ తప్పుతుందని. నా మాటలు చెల్లాచెదురౌతాయని. ఆంక్షల్లేని ప్రేమలో నేను పూర్తిగా కరిగిపోతానని... నాలో ఒక సముద్రం పొంగి ఆ అలలు ఆమె పాదాల్ని స్పృశించడానికి మౌనంగా పరవళ్ళు తొక్కుతాయని... ఆమె సమక్షంలో నేను ప్రతి క్షణం మరణించి మళ్ళీ కొత్తగా జన్మిస్తానని..

"మీరు నన్ను ప్రేమించలేదా" అని అడిగింది.. నాకామెతో చెప్పాలనుంది "నేను" "ఆమె" "ప్రేమ" వేరు కాదని..

కానీ ఆమెకెలా చెప్పగలను? రెండేళ్ళ క్రితం నాకు చనిపోయినట్టు వచ్చింది కల కాదని..

త్వరలో నిజమవబోతోందని...

రేపు మృత్యువు నా తలుపు తడుతుందన్నది ఊహ కాదని..

నిజమని...

నేనిక ఎన్నాళ్ళో బ్రతకనని...

ఆమెతో..

ఎలా...?

                              -------------------- x --------------------

(రచనా కాలం : 2007, ఫిబ్రవరి)

Monday, April 2, 2012

శూన్యంలో పూలు

పొగ త్రాగరాదులో "దు" చెరిపి వేసే చిలిపి బాల్యాలునావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన వేసవి రాత్రి కొవ్వొత్తి వెలుగుతుంటే కొవ్వు కరిగి రకరకాల కళాకృతులు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలువినాయక చవితి నాడు పనసాకుల బుట్టల్లో రుచిగా ఉడికే కుడుములు, "రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాలు సమానాలు" అని వల్లెవేస్తున్న సూర్యారావు మేష్టారి మేడ మీద ట్యూషన్ పిల్లలు, చెల్లా చెదురైన ఏడు పెంకులూ దొంతు పెట్టేసామని పొంగిపోతుండగానే మళ్ళీ కూలిపోడాలు,  వైజాగు పాత పోస్టాఫీసుకీ, కైలాసపురానికీ మధ్య అలుపెరుగక ట్రిప్పులు కొట్టే 48A బస్సులు, మిలే సుర్ మేరా తుమారా అని డిడిలో వస్తుంటే అర్ధం తెలీపోయినా కళ్ళప్పగించి చూడ్డాలు, వానజల్లు కొడుతుంటే కిటికీ పాసుపోత్తోంది అనే చంటాళ్ళు, టీచరు రాని క్లాసురూంలో బ్లాక్ బోర్డుమీదకెక్కే మాట్లాడిన వాళ్ళ పేర్లూ, మొదటిసారి గెడ్డం చేసుకున్నాకా చెంపల మీద జిల్లుమన్న ఆఫ్టర్ షేవ్ లోషన్లు, పరిక్ష రోజు ఉదయం హాల్ టిక్కెట్లకి అంటిన పసుపు కుంకుమలు, 045 రేనాల్డ్స్ ఫైన్ కేర్బ్యూర్ పెన్నులతో రాసి రాసి నింపిన అడిషినల్ షీట్లూ, పీచు మిఠాయి జాడీలోంచి పొట్లాంలోకి ఎన్ని పుల్లలొస్తున్నాయో అని ఆశగా చూడ్డాలు, బాత్రూంలో బాల్టీకి అతికించబడిన బొట్టుబిళ్ళలు, వానలో తడిసి పరిమళించే నీలగిరి చెట్టు బొంగరాలు, సాయంకాలపు రైలు కిటికీలో బింబప్రతిబింబాల నాట్యాలు, హైద్రాబాద్ కోఠీలోనూ, విజయవాడ లెనిన్ సెంటర్లోనూ, వైజాగు పోలీస్ బేరెక్సు దగ్గరా పాత వాసన వేసే పుస్తకాల కొట్లూ, తిరుపతి పాసింజర్లో కరకరలాడే సమోసాల మధ్య తొక్క తియ్యని బంగాళాదుంపలు, బయట వాన పడుతుంటే బాత్రూంలో వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి అద్దం మీద ఆవిరిని అరచేత్తో తుడిచి మొహం చూసుకోడాలూ, వెయ్యి సంవత్సరాలు వేలాడే పోలిథీన్ కవర్లో ఒక్కరోజులోనే వాడిపోయే మల్లెపూలు, "ఓయబ్బో మీ బొట్టెడు నోట్లో ఏలెడితే కొరకనేడు మరి" అనుకుంటూ పల్లెటూరి తగూలు, హాస్టల్ బయట టెలిఫోను బూతులో మాటకి విలువ పెరగడాలూ, తిరునాళ్ళలో కళ్ళముందు ఎగిరే రంగు రంగుల సబ్బు బుడగలు, నూతి చప్టాలో నానుతున్న బాదం చెట్టు ఆకులు, గూట్లో ఇసక అంటుకున్న లైఫ్ బాయ్ సబ్బులు, రైలొస్తుంటే గుండె దడ హెచ్చే ప్లాట్ ఫారాలు, క్లాసు పుస్తకాల మధ్య ఒద్దికగా ఒదిగిపోయే చందమామ బాలమిత్రలు, తిరుపతి గుండు మీద చల్లటి నీళ్ళు పోసుకున్నాకా వెచ్చగా తగిలే అరచేతుల వింత స్పర్శ, గరుకు గచ్చు మీద అష్టాచెమ్మా కోసం చింత పిక్కలు అరగదీస్తుంటే పుట్టే వేడి, రాజమండ్రిలో సంధ్య వేళ జాలరి వల మీద చీకటి వెలుగులు చిత్రించే వింత చిత్రాలు, కోరమండల్ ఎక్స్ ప్రెస్లోంచి గోదావరిలోకి భక్తిగా జారే చిల్లరనాణేలు, స్టేషన్ చేరువవుతుంటే అనంతంగా చీలిపోయే రైలు పట్టాలు, దిద్దీ దిద్దీ లావెక్కిపోయే పలక మీద , ఆలు, దారిపక్కన ఏమీ ఆశించకుండా పూసే చంద్రకాంతం పూలూ, కావేరీ తీరాన రంగనాథుని కోవెళ్ళూ...